30, నవంబర్ 2022, బుధవారం

నీటి అడుగు

నీటి అడుగు 

***********

 అలసి పోయి కొనఊపిరి నిలిచి పోయిన   

రాలిపోయిన ఎండుటాకుల్ని కుప్పచేసి 

ఈ  చలి  కాలం  మంట కాగవచ్చు వెచ్చంగా .. 

జ్ఞాపకాలు కొన్ని బూడిద లో చేరి 

ఇక బుద్దిగా  నిదురలోకి జారిపోతాయి 

***********

వెలుగు రేకులు పూర్తి గా విరబూయక ముందే  

సూర్య కిరణాలు తాకి కంటి వెలుగులయ్యే పచ్చని ఆకుల్ని 

నా ఆనందాశ్రువులతో ఒక్క సారి తడి చేయాలని  వుంటుంది 


నువ్వు  గాలై  వీచి, వీచి  కొమ్మలు ఊ యలలయ్యే  వేళకి 

కడిగిన ఆకుల చినుకులు నేల తాకితే .. 

ఆ పదను కే .. 

జ్ఞాపకాల గొడుగు పురి విప్పుకుంటుంది 

ఊరేగింపులా జీవితం నీటి అడుగులు వేస్తుంది 





 

28, నవంబర్ 2022, సోమవారం

ఒకానొక నువ్వు


ఒకానొక నువ్వు 


 తెరిచి పెట్టిన  గుండె తలుపు   కిటికీ 

బాండ బారిన సమాజానికి వెలుపల 


 కవిత్వానికి  అదే దొడ్డిదారి 

 కటకటాల కిటికీది  పోరుదారి 


ఇప్పుడు .  

వీధి గుమ్మం బార్లా తెరిచి వుంచాను 

నువ్వు..  నాలోకి .. 

నేను..  నీ లోకి 

గదిలోకే  అయినా 

జలపాతం లా దూకేందుకు వీలుగా  .. 


ఎండ దుప్పటి పరుచుకొని నిన్న 

నీకోసం చూసాను 

మనుసు దుమ్ము దులుపుకొని ఈ రోజు 

మళ్లీ  ఎదురు చూసా .. 

ఆశ కి చావు లేదు 

రేపటి ఘన స్వాగతం గురుంచి 

పగటి కలలు కంటూనే ఉన్నాను 


ఖచ్చితత్వాన్ని కాల గర్భం లో కలిపిన కాలాన్ని 

గోడ గడియారం లో  బంధించాను  

గంట గంటకు అది ఒకటే కొట్టుకోవడం నా గుండె లాగ.. 


తలుపంత కళ్ళేసుకుని అవే  ఎదురు చూపులు 

పాదాలు రెండు దీప స్థంభాలు .. 

చేతి వేళ్ళు ఎప్పుడో పది వింజామరలై  గాలిలో .. 










#muneer family

 

కుటుంబం x సమాజం 

పురుషులందు పుణ్య పురుషులు వేరయా .. 

పితృ స్వామిక సమాజం లోనూ మగవాళ్ళ మధ్య  సమానత్వం లేదు .. 

పాపపుణ్యాలను నమ్మని వారు  .. మనిషి చైతన్యాన్ని పరిగణ లోకి తీసుకునే వారు 

పైన చెప్పిన వేమన పద్య చరణాన్ని ..  మనుషులందు పోరాడే మనుషులు వేరయా .. అని మార్చుకోవచ్చు  .. 

పోరాడే మనుషుల్లోను  రూపం ,సారం .. సమస్య ఒకటి ఉంటుంది . 

పైకి కనిపించే రూపం లో మునీర్ ఒక పోస్టర్ బాయ్ .. ఉవ్వెత్తున లేచి పడే  సింగరేణి కార్మిక వర్గ చైతన్యానికి ఒక ప్రతీక . 

సారం లో మనలాంటి మామూలు మనిషే .. కానీ మన చుట్టూ ఆవరించి వున్న సామాజిక చట్రం లోనే  కుటుంబ బాధ్యతలను నిర్వరిస్తూ ,తన  చైతన్యం తాలూకు అభిప్రాయాలను ,ఆలోచనలను వదిలిపెట్టకుండా  తన మత అస్థిత్వాన్ని గౌరవిస్తూనే సామాజిక బాధ్యతల పట్ల ఒక ఎరుక కలిగి ఉండడం.. ఒక   గొప్ప విషయం .. అది మనకు మునీర్ లో కనిపిస్తుంది .  

చాలా మంది ఒక సామాజిక మార్పు కోసం నిలబడాల్సి వచ్చినపుడల్లా కుటుంబాన్ని ,సమాజాన్ని ఎదురెదురుగా నిలబెట్టి , కుటుంబాన్నే ఎంచుకొని ఒక రక్షణ లో ఇమిడి పోవడానికి సిద్దపడిపోతారు . 

ఇక్కడ మునీర్ ఆ మూస పోసిన విధానాలను బద్దలు కొడతాడు . 

నిజంగా  పోరాడే భావాలే మనలో ఉంటే ,దానికి ఏవి  అడ్డు నిలబడ లేవు . మన నిజాయితీ పట్ల నమ్మకం ఉన్న వారెవరు ,కుటుంబ సభ్యులు సైతం మనల్ని మన  ఆచరణ నుండి ఆపలేరు .ఈ విషయాన్ని మునీర్ అతి సునాయాసంగా చేసి చూపిస్తున్నాడు . అతడు ఒక సజీవ ఉదాహరణ .  

 గుండె తలుపు 


కిటికీ ..  చిట్టివి రెండు రెక్కలు దానికి 

ఎప్పటికప్పుడు మడిచి 

జేబులో పెట్టుకుని పోయే బుల్లి పిట్ట నాకు 


కిటికే .. లోకం గా బతికిన రోజులు 

ఇప్పుడు గురొస్తే ఇది చావు కన్నా హీనం 


కిటికీ రెక్కలు పూర్తిగా విరిచి కట్టి 

గాలికి  గుండె లో గుడి కట్టేవాణ్ణి 


 గడప దాటి వెళ్లే స్వేచ్ఛ లేని బాల్యం 

కిటికీని కంటికి రెప్పలా కుట్టేసుకున్నాను 


సగం కోసిన  కిటికీ రెక్కలు లు తెలుసు 

పై రెక్కలు మాత్రమే తెరిచి బురఖా తో లోకాన్ని చూడాలి 

 ఆమె .. అలా  చీకట్లో మగ్గిపోవాలి 


ఎంతో నయం నా జీవితం 

మగ పుట్టుక పుట్టినందుకు 

అవునూ .. అప్పట్లో కిటికే    

నిలువెత్తు నా గుండె తలుపు .. 







24, నవంబర్ 2022, గురువారం

A K 47జర్నలిస్ట్

 A K 47జర్నలిస్ట్ 

బొగ్గు పెల్ల కే  నోరుంటే  .. అది తప్పకుండా  మునీర్ గొంతుకే ! 

ప్రజల గొంతుకను నినదించేందుకే పత్రికా రంగాన్ని ఎంచుకున్నాను .. 

 తన జర్నలిస్టు  నేపధ్యం గురుంచి చెప్పాడు . అతని మాటల్లోనే .. 

"ఆ సమయం లో నేను అనేక విషయాలతో ఘర్షణ పడాల్సి వచ్చింది . నా జైలు జీవితం తర్వాత నా కంటూ ఒక కుటుంబం ఏర్పడింది. సింగరేణి  ఉద్యోగం ఉంది . అయినా మనసులో ఎదో ఒక అసంతృప్తి . 

ఇన్నేళ్ళుగా నేను ఏ పార్టీ (భారత కమ్యూనిస్ట్ పార్టీ ) లోనైతే తిరిగానో ,ఎవరితో కలిసి పని చేసానో .. వారి పట్ల ,వారి నడవడిక పట్ల  ఒక అసంతృప్తి . వాళ్ళ రాజీ  ధోరణి ,అవకాశవాద లంచగొండి విధానాలు నాకు అస్సలు నచ్చేవి కావు . 

సిద్ధాంతాలు ఏమి చెబుతున్నాయి ? మన నడవడిక ఎట్లా వుంది ?  ఇట్లా అయితే కార్మికవర్గానికి మనం ఏమి మేలు చేస్తాం ? - ఇలా ఘర్షణ పడేవాణ్ణి . 

కమ్యూనిస్ట్ సిద్ధాంతాల పట్ల అపారమైన విశ్వాసం వుంది . కాని , ఆచరణే అందుకు భిన్నంగా ఉందనిపించేది . 

నా విమర్శలేవి అగ్ర నాయకత్వం పట్టించుకోలేదు . పైగా నన్ను శత్రువులా చూడటం మొదలు పెట్టారు . మరోవైపు అప్పుడే మొగ్గ తొడుగుతున్న విప్లవోద్యమం   నన్నెంతగానో ఆకర్షించింది  . అదే సమయం లో విప్లవం పేరు మీద జరుగుతున్న దుందుడుకు చర్యలు నన్ను ఇబ్బంది పెట్టాయి  . 

ఇటువంటి సందిగ్ధ సందర్భం  లో   నన్ను నేను నిలబెట్టుకోవడానికి   నాలో ఒక అన్వేషణ మొదలైంది . 

అమ్మ ఎప్పుడూ చెబుతూ వుం డేది .. 

"బిడ్డా ! లోకం లో మంచివాళ్ళకే కష్టాలు ఎదురైతయి. కష్టాలు ఎదురైనవని మంచిని వదులుకుంటే మనిషి బ్రతికి వుండి సచ్చినట్టు లెక్క !" 


 పత్రికలు ;పెట్టుబడికి పుట్టిన విషపుత్రికలు -మహాకవి శ్రీ శ్రీ 

ఈ స్పృహ వుండింది తనకు . కాని , ఎదో ఒక మేరకు ప్రజల గొంతును వినిపించటానికి ఇంతకు మించిన మార్గం  కూడా లేదనుకున్నాడు . 

అప్పుడు  పత్రికల్లో సింగరేణి కాల్ బెల్ట్ వార్తలు 'సింగిల్ కాలమ్ "(single column )కే  పరిమితమయ్యేవి . 

వాటికి నడక నేర్పి పరుగు పెట్టించాలి . 

ఆ   సంకల్పం తో మొదట ' స్ట్రింగర్  '(stringer ) గా "ఈనాడు "దిన పత్రిక లో చేరాడు . కాని , అక్కడ సరిపడక "ఆంధ్రజ్యోతి " కి మారాడు . మధ్యలో కొన్నిరోజులు ఆ పత్రిక ఆగిపోయినా ఆ తర్వాత అందులోనే కొనసాగాడు . 

అవి .. విప్లవ కార్మికోద్యమం  మంచి ఊపు మీదున్న రోజులు . సికాస (సింగరేణి కార్మిక సమాఖ్య )ఎర్రటి అక్షరాల గోడ పోస్టర్ చూస్తే చాలు కార్మికులు కదనరంగం లోకి దూకే వాళ్ళు . అప్పటి ఆదిలాబాద్ ,కరీంనగర్ (ఇప్పుడు మంచిర్యాల ,పెద్దపల్లి జిల్లాలు )ప్రాంతాల లోనే కాదు కొత్తగూడెం వంటి  దూర  ప్రాంతాలకు కూడా సికాస కార్య కలాపాలు విస్తరించాయి .

 దాని వెంట ప్రభుత్వ అణిచివేత మొదలయ్యుంది . 

అప్పటికింకా తెలుగుదేశం పార్టీ అధికారం లోకి  రాలేదు .  1983 లో ఆ పార్టీ  అధినేత ఎన్ .టి రామారావు  " నక్సలైట్లే దేశభక్తులు " అని ప్రకటించి , ముఖ్య మంత్రి అయ్యాక  1985 ఏప్రిల్ నెలలో   కొండాపూర్ ఎన్కౌంటర్ తో తన నిజస్వరూపాన్ని బయట పెట్టుకున్నాడు . ఆ తర్వాత పోలీసుల దమన కాండ పెరిగింది  .

 ఊడ్లకు ఊళ్లు తగలబెట్టడం ,కార్యకర్తల ఇండ్లను ధ్వంసం చేయడం ,విప్లవ కారులు కనిపిస్తే కాల్చివేయడం లాంటి యుద్దవాతావరణం లో తెలాంగాణ గ్రామాలు రక్తసిక్తం అయ్యాయి . 'భారతి' ,'పియర్ వికాస్' వంటి పేర్లతో నల్లదండు ప్రభుత్వ ముఠాలు పుట్టుకొచ్చాయి . 

ప్రత్యేక పోలీసు బలగాల వేట లో గ్రామాలు తల్లడిల్లాయి .చివరికి ప్రజాస్వామిక వాదులు  కూడా ఈ దాడులకు గురికాక  తప్ప లేదు . 

నిర్బంధ ప్రభావం బొగ్గుగనుల్లోకి విస్తరించింది . కాలరీ ప్రాంతం  మొత్తం  రక రకాల సాయుధ బలగాలతో నిండిపోయింది . 

ముఖాలకు నల్లటిగుడ్డలు కప్పుకుని కార్మిక వాడల్లో  ఊరేగింపు జరిపే ఇండో టిబెట్ సైనికుల పద ఘట్టనలతో    నల్ల నేల తల్లడిల్లింది. 

ఎప్పుడు , ఎవరిని ..ఏ అర్దరాత్రి   పట్టుకు పోతారో తెలియని పరిస్థితి . అరెస్టులు , చిత్రహింసలు కాలరీ ప్రాంతం లో నిత్య కృత్యం గా మారిపోయాయి . 

మిస్సింగ్ కేసులు 

లాటి అమెరికా దేశాలలో మాదిరిగా మనుషులని మాయం చేయడం . 

మునీర్ పనిచేసే మందమర్రి కే కే 5 ఇంక్లైన్ లో కార్మికుడు సమ్మయ్య ను ,అతనితో పాటు మరో ఇద్దరినీ ఎత్తుకుపోయి పోలీసులు గుట్టు చప్పుడు కాకుండా మాయం చేశారు . 

బాధితుని భార్య మునీర్ తో తన గోడు వెళ్లబోసుకుంది  . 

ఎన్కౌంటర్ గురుంచి వాస్తవాలు రాయటం .. అంటే  పెద్ద సాహసమే !

పోలీసుల 'అట్రాసిటీ'  గురించి ఏమి రాసినా  అప్పట్లో "కొరివి తో తల గోక్కున్నట్టే !"  


సమ్మయ్యను మాయం చేసిన కథనం  ఫోటో తో సహా తెల్లారి పత్రికలో వివరంగా వచ్చింది. 

తనకు పరిచయం ఉన్న కానిస్టేబుల్ మిత్రులు కొందరు "అన్న .. అతిగా పోతున్నవ్ .. మా సర్కిల్ చాలా కోపం మీద ఉన్నాడు . జాగ్రత్త !"అని హెచ్చరించేవారు . 

అప్పుడప్పుడు ఎన్కౌంటర్ విచారణకు బాలగోపాల్ వంటి పౌర హక్కుల నాయకులు వచ్చే వాళ్ళు . 

పౌర హక్కుల సంఘం కు సహకరించడం అంటే  కూడా అంతే !

"హక్కుల సంఘం వాళ్లంటే .. అన్నింటికీ తెగించిన వాళ్ళు .. మనం అట్లా కాదు కదా .. వాళ్ళు వస్తరు .. పోతరు .. తెల్ల వారిన తరువాత .. పోలీసు వేధింపులు .. ఎందుకొచ్చిన తంటా .. "అని ఇతర జర్నలిస్ట్ మిత్రులు  భయ పెట్టేవారు .  

అవేవి  లక్ష్య పెట్టేవాడు కాదు .. ఇంట్లో అమ్మ కానీ ,తన భార్య రిజ్వానా కానీ ఇట్లా ఎందుకు చేస్తున్నావని కూడా అడిగే వాళ్ళు కాదు . అయినా వాళ్ళ ముఖాల్లో ఎప్పుడూ ఎదో భయం తొంగి చూసేది . 

"పంధై  పదేళ్లు బ్రతకటం కంటే నందై నాలుగు ఏండ్లు బ్రతికినా చాలు " అని అమ్మ చెప్పే సామెత ను గుర్తు పెట్టుకొని , పౌర హక్కుల నాయకులకు కావాల్సిన అన్ని ఏర్పాట్లచేయడమే కాకుండా వారితో పాటు వెళ్లి  బాధిత కుటుంబాలను కలిసేవాడు . 

1987 ఆగష్టు 14, తెల్ల వారితే స్వాతంత్ర దినోత్సవం , కొత్తగూడెం ప్రాంతం లో సికాస నాయకులైన మోట శంకర్ ,షంషేర్ ఖాన్ ,రవీందర్ రెడ్డి , వీరయ్య లను ఎన్కౌంటర్ పేరుతో కాల్చి  చంపారు . 

అలా సింగరేణిలో ఎన్కౌంటర్ ల పరంపర మొదలైంది .. 

ఎత్తుకు పోయి ,మాయం చెయ్యడం  లాంటి  దుర్మార్గాలకు  కూడా పోలీసులు తెగబడ్డారు .

సమ్మయ్య , పాల్గుణ ,సారయ్య మరియు  కుమార్ అనే సికాస కార్యకర్తలను మొదట మాయం చేసి అటు తర్వాత కాల్చి చంపి ,ఆ విషయాన్ని తొక్కి పెట్టారు .

 ఇటువంటి ప్రభుత్వ హత్యలు .. మిస్సింగ్ కేసులుగా నమోదు అయ్యేవి . 

మందమర్రి కి పది కిలోమీటర్ల దూరం లోని  బెల్లంపల్లి  కాలరీకి చెందిన కుమార్ ను అక్కడి నుండి మరో పది కిలోమీటర్ల దూరం లో  మాదారం కాలరీ లో ఉండే అతని అక్క ఇంటి నుంచి ఎత్తుకెళ్ళి ,మాయం చేశారు .

 ఈ కిడ్నాప్ కథనాన్ని మునీర్ ఆంధ్రజ్యోతి కి పంపించాడు .అయితే బెల్లం పల్లి వార్తను మందమర్రి డేట్ లైన్ లో పనిచేసే మునీర్ వ్రాయటం ;ఇద్దరి విలేకరుల మధ్య ఘర్షణకు దారి తీసింది .

అప్పట్లో పోలీసులకు భయపడి మిస్సింగ్ వార్తలు రాయటానికి ఎక్కువ మంది ముందుకు వచ్చే వాళ్ళు కాదు . ఇది..  మునీర్ చొరవ !

ఈ మిస్సింగ్ వార్తా  కథనం కోల్ బెల్ట్ లో పెద్ద సంచలనం అయింది . 

కుమార్ అప్పటికే  'సిపిఐ ' అనుబంధకార్మిక సంఘం  'ఏఐటీయూసీ' లో చురుకైన కార్యకర్త కావడం తో విషయం  కాస్త 'సీరియస్'  అయింది . 

 కుమార్ ను  వెంటనే విడుదల చేయాలని , బెల్లంపల్లి  బావులు బందు పెట్టి సమ్మెకు దిగారు . ప్రభుత్వం  దిగి వచ్చి , విచారణకు ఆదేశించింది .

 మధుకర్ అనే  పోలీస్ అధికారిని సస్పెండ్ చేశారు . 

ఈ మొత్తం వ్యవహారానికి మునీర్ ని భాద్యుణ్ని చేస్తూ పోలీసులు బెదిరింపులకు పూనుకున్నారు . 

ఈ మిస్సింగ్ కేసు విచారణకు పౌరహక్కుల సంఘం తరుపున బాలగోపాల్  నేరుగా మునీర్ ఇంటికే  వచ్చారు .

పోలీసు పహారాల మధ్యే మునీర్ సహకారం తో బాలగోపాల్  కేసు  విచారణను విజయవంతంగా ముగించేవాడు . 

మిస్సింగ్ కేసు లపై ప్రజల ఆందోళన ఫలితంగా రాష్ట్ర ప్రభుత్వం టి .లక్ష్మి నారాయణను   కమీషనర్ గా    నియమించింది . 

 మునీర్  'కోల్ బెల్ట్' లో    పన్నెండు మిస్సింగ్ కేసుల  కుటుంబాలను కలిసి , సాక్ష్యాలను నమోదు చేసి కమిషన్ ముందుకు తీసుకు పోయారు . 

ఈ కుటుంబాలను వెంటబెట్టుకుని అనేక మార్లు కమీషన్ ముందుకు తీసుకు వెళ్లాల్సి వచ్చేది . ఇదంతా పోలీస్ అధికారులకు కోపకారణం అయ్యేది . మునీర్ ని రకరకాలుగా వేధించేవారు . 

అర్థరాత్రప్పుడు పెద్ద సంఖ్యలో పోలీసు వాహనం తో వచ్చి ఇంటిని చుట్టుముట్టేవారు . సోదాలు చేసేవారు . నక్సలైట్లు వచ్చారని సమాచారం ఉందని దబాయించే వాళ్ళు . 

కొన్నిసార్లయితే "వాణ్ని ఎన్కౌంటర్ చేస్తాం .. అప్పుడు ఎవడు వచ్చి నిజనిర్ధారణ చేస్తాడో చూద్దాం .. అంటూ  పోలీస్ అధికారులు తమ కోపాన్ని బహిరంగం గానే వెళ్లగక్కేవాళ్ళు . 









22, నవంబర్ 2022, మంగళవారం

#muneer 4

 నదీ పరివాహక ప్రాంతం లోనే  మొదట మనిషి బ్రతికి బట్ట కట్టింది .. ఆ తర్వాత నీటి చెలిమల్ని కనిపెట్టి ఉంటారు . మెల్లిగా నీళ్లబావి తవ్వుకోవడం నేర్చుకొని ఉంటారు  .. 

పారిశ్రామిక విప్లవం బద్దలయ్యేంతవరకు మానవ నాగరికత నీళ్ల  బావి చుట్టే తిరిగింది . అంట రాని  తనం పురుడు పోసుకున్న మన దేశం లో కొన్ని కులాలకు మంచి నీళ్ల బావి నిషిద్ధమైంది 


ప్రపంచవ్యాప్తంగా ఈ నదీ తీరప్రాంతాలలోనే బొగ్గు నిల్వలు బయట పడ్డాయి . గనులు తవ్వారు. వాటిని వాడుక భాష లో బొగ్గుబావులే అనేవారు . ఆ తరవాత పెట్రోల్ బావులు వచ్చాయి .  ఎవరికి  వాళ్ళు  వారి  అవసరాన్ని బట్టి వాడుకొనేవి నీళ్లు . కాబట్టి మంచినీళ్ల బావులు ఊరు  వాడ కి లేదా  ..కొన్నిచోట్ల దొరలకి సంబంధినవి గా ఉండేవి . 

మన దేశం లో మంచి నీటి కోసం యుద్దాలు కూడా జరిగాయి . 

ఒక వైపు మంచి నీళ్ల బావుల కోసం ఇలాంటి పరిస్థితులు ఉండగా ,ఖండాలు దాటి వచ్చిన తెల్లవాడు బొగ్గు బాయలు తవ్వాడు . మంచి నీటి లాగ అది ప్రకృతి సంపదే .. కానీ దాని మీద అధికారం వాడిదయ్యింది . వాడి రాజ్యాధికారం వందల ఏండ్లు అపప్రతిహతం గా కొనసాగడానికి అది ఇంధనమైంది . ఇలా ప్రకృతి సంపదల మీద వారి ఏకఛత్రాధిపత్యం ఇవ్వాళ ప్రపంచ పర్యావరణాన్ని సంక్షోభం లో పడ  వేసింది. 

మానవాళి అభివృద్ధి పేరు చెప్పి వారి అధికారాన్ని సుస్థిరం చేసుకొనేందుకు విచ్చల విడిగా మిలటరీ అవసరాల కోసమే ఎక్కువగా వినియోగిస్తున్నట్లు ఒక పరిశోధన లో వెల్లడైనది . 

ప్రజా అవసరాలకే అయితే ఇంత ఇబ్బడిముబ్బడిగా ఓపెన్ కాస్ట్ బొగ్గు గనులు తవ్వి ,మరింతగా కాలుష్యాన్ని నెత్తికెత్తుకోవాల్సిన అవసరం లేదు . పెట్టుబడి దారుల లాభాపేక్షకు అంతం లేదు . ప్రపంచాన్ని మొత్తం భయం అంచున నిలబెడతారు . అభివృద్ధి యజ్ఞం లో ప్రజలను బలిపశువులను చేస్తారు .   

#muneer

 notes.. 

అనేక చెట్ల సమూహమే అడవి . తీరొక్క చెట్టు అడవి నిండా .. అదే ప్రకృతి .. భిన్నత్వం లో ఏకత్వం . 

మానవుడూ అంతే .. సమాజం ఒక ఆలంబన . 



#muneer

 #మునీర్ 

ఏ చరిత్ర చూసిన ఏమున్నది గర్వకారణం .. నరజాతి చరిత్ర సమస్తం పర పీడన పరాయణత్వం .. అంటాడు మహాకవి శ్రీ శ్రీ .. 

కానీ కార్మికోద్యమ చరిత్ర దానికి మినహాయుంపు .. క్రీ .శ . 871 లో కొద్దిరోజులే నిలిచినా పారిస్ కమ్యూన్ ,ఆ తర్వాత చికాగాలో   క్రీ .శ .1886 లో మేడే పోరాటం .. ఆ స్ఫూర్తి తో ప్రపంచ వ్యాప్తంగా విస్తరించిన కార్మిక వర్గ విప్లవాల చరిత్ర పెట్టుబడిని ఇప్పటికి భయపెడుతూనే వుంది . విశ్వవ్యాప్తం అయిన సోసిలిస్ట్ భావనలు మనిషిని బానిసత్వం నుంచి విముక్తం అయ్యేటందుకు ప్రేరేపించాయి . 

వలసల తో ,సాంమ్రాజ్యవాదం తో ప్రపంచాన్ని పంచుకు తిన్న పెట్టుబడి , సంకోషభాలలో మునిగి తేలుతూ ప్రపంచీకరణ ఫాసిస్ట్ విధానాలతో ఇప్పుడు ప్రజలు శత్రువు గా నిలబడింది . 

ఇవ్వాళ రెండే  రెండు శిబిరాలుగా ప్రపంచం చీలిపోయింది . రాజ్యాధికారాన్ని గుప్పిట పెట్టుకున్న 

గుప్పెడు దోపిడీ వర్గాలు . ప్రపంచ మానవాళి కనీస అవసరాల కోసం ,సాధించుకొన్న హక్కుల కోసం ఉద్యమిస్తున్న కార్మిక వర్గం . 

దోపిడీ గుట్టు విప్పి చెప్పిన మార్క్సిజం వెలుగులో కార్మికోద్యమ చరిత్ర కొత్త పుంతలు తొక్కింది .. 

మార్క్సిస్ట్ మహా ఉపాధ్యాయులు ;లెనిన్ ,స్టాలిన్,మావో ల బాటలో అనేక విజయాలు సాధిస్తున్నారు 


21, నవంబర్ 2022, సోమవారం

 జీవితం చిన్నదే కదా !

 -----------------------------

 చీకటి వెలుగుల్ని తోసుకుంటూ 

తన చుట్టూ తనే భ్రమించే 

భూగోళం బుగ్గపై గిల్లి చూస్తాను 

నువ్వు .. నిజమా .. కల .. అని 


ఆ మాత్రం దానికే ఎక్కడో చిల్లు పడి 

జ్ఞాపకాల ప్రవాహం జారీ పడి .. 

చలికాలం నిద్ర ముసుగు తొలిగి పోతుంది 


కొండల్లో పాతుకు  పోయిన చెట్టు మొదలు 

జారిగిల పడ్డ ప్రయాస .. 

ఇంకా కండ్లు మూసుకొనే నీ చేతి లో చేయు వేసి నడుస్తూ వుంది 

వెతుకులాట విస్తీర్ణం ఎప్పుడూ కనుచూపు మేరలు దాటుతూనే ఉంటుంది 


పువ్వు లు పూసి మొక్కలు సిగ్గు పడుతుంటాయి 

బాటసారి పాదాల పగిలిపోని బొబ్బలు చూసి .. 


గొప్పలు కాక పోతే జీవితం ఏమంత గొప్పది 

గుప్పెడు గుండె లో ఇమిడిపోయే 

పిడికెడు ప్రేమకు బానిస .. 




 అపరిచితం 

----------------

 ఒక వేట నిరంతరాయం గా కొనసాగుతుంటుంది .. 

విషయాన్ని మాములుగా చెప్పాలనే మనసు రాయి చేసుకుంటాను 

అయితే .. 

ఆ రాయినే ఎవరో చేతిలోకి తీసుకొని నా ఆలోచనల తుట్టె మీదికి విసురుతారు 

అంతే .. 

నా భాష మారిపోతుంది 

పరిసరాలు రక్తం పులుముకుంటాయి 

నా భావాలు నన్నే ప్రశ్నలతో తూట్లు పొడుస్తుంటాయి 

నేను వేటాడబడుతుంటాను 

కాలు కింద పెట్టకుండా పరుగెడుతుంటాను 

దాక్కోడానికి చాటు కోసం వెదుక్కుంటాను 

అక్షరాలే నన్ను తమలో పొదువుకుంటాయి 

అలసిపోయి కొంత .. అలవాటుగా కొంత 

వాటి గుండెలపై ఒదిగిపోతాను 


.. ఇది అసలు విషయానికి గొంతు సవరింపు  మాత్రమే .. 

అలాగని విషయం పెద్దగా  ఏమీ ఉండదు .. 

ఇలా అటు ఇటుగా పదాలు తిరగేసి 

చివరికి పెదవి విరవటమే .. 

అబ్బే .. ఏమీ లేదండి .. 

కానీ విషయం చిన్నదే .. ఒక్క మాట పెట్టు !

వివరించే తాపత్రయం హడావిడి మాములుగా ఉండదు 

భరించాలి .. కవిత్వం అంటే అంతేనేమో !


... 

దినమంతా మిత్రుడి వెంట 

ఒక ప్రాణ సమానమైన రాజకీయ చర్చ చేస్తాను 

దాని చుట్టు అనేక విషయాలు వచ్చి చేరుతుంటాయి 

విచిత్రంగా  నువ్వు అక్కడా  

లీలగా కదలాడుతుంటావు 

అలసిపోయి నిద్రగది కి చేరుకుంటే 

తలుపు తోసుకుని మరీ నీ తలపే .. 

నీ స్మరణకు పరిపూర్ణమైనది ఒక్కటే .. 

దానికోసం వెతుక్కుంటాను 

కళ్ళుమూసుకొని గజల్ గీతాన్ని 

ఆవాహన చేస్తాను 

జగజిత్ సింగ్ తసల్లీ స్వరం .. 

ఈ ప్రపంచం లో .. 

నా జీవితానికి నేనే అపరిచితుడ్ని 

ఒక్క  .. నీకు తప్ప .. 







8, నవంబర్ 2022, మంగళవారం

 మునీర్ .. పేరు వల్ల కొంత తెలిసిపోతుంది..  ఇస్లాం మతం లో పుట్టి పెరిగాడు .. ఆ పేరు గాని ఆ మతం గాని అతన్ని ఈ తెలంగాణా పల్లె మందమర్రి  కాలరీస్ ప్రాంతం లో ఎదగడానికి పెద్దగా ఎలాంటి ఆటంకాలు కలిపించినట్టు లేదు . ఏదైనా వివక్ష ఎదుర్కొని ఉంటే ఆ విషయం అతనే విప్పి చెప్పాలి . 

ఇది ఉద్యమాల పురిటిగడ్డ కాబట్టి వివక్ష కొట్టొచ్చినట్టు కనబడేది కాదు. 

భారత్ స్వాతంత్రోద్యమ చరిత్ర లో నే హిందూ ముస్లిం బీజాలు పడ్డాయి నిజం కాలం లో తెలంగాణా  లో రజాకార్ల అరాచాకాల వల్ల అలాంటి పరిస్థితి నెలకొన్నప్పటికీ కమ్యూనిస్ట్ పార్టీ ప్రభావంతో ప్రజల మధ్య స్నేహం మిగిలి ఉంది . కానీ సామాజిక పరిస్థులు అస్తిత్వాలని పక్కకు పెట్టే స్థాయికి ఎదగని కారణంగా అస్తిత్వాల వివక్ష కొనసాగేది . కుల వివక్ష కు పోటీగా కాక పోయినా ముస్లిం అనే అస్తిత్వం 

ప్రత్యేక కృషి వల్లే పైకి వచ్చే స్థితి.సాధారణ  సామాజిక ప్రవాహం లో కొట్టుకు వచ్చే అవకాశాలు తక్కువ. మరి అలాంటి గతం లోంచి ,మతం లోంచి ఎదురీది ఉన్న ఊరు కి పేరు తీసుకురావడం అంటే అది మామూలు విషయం కాదు . 


పోస్టర్ బాయ్ .. 

***********

 ప్రపంచీకరణ యుగం లో యువతరం అంతా ఇష్టపడే విప్లవ ముఖ చిత్రం చేగువేరా ,, 

దేశభక్తి ముసుగు ని చించి ,దేశాల సరిహద్దులు చెరిపేసి విప్లవాలు నడిపిన చేగువేరా ఇంతగా అందరిని ఆకర్షించడం లో రాజకీయాలు ఏమి వున్నా మనిషి ఒక సత్యానికి దూరం గా బ్రతకలేడ నే విషయం ఇక్కడ వెల్లడవుతుంది . 

భారత విప్లవ ముఖ చిత్రం .. భగత్ సింగ్ 

కరెన్సీ నోట్ల మీద , కోర్టు గదుల్లోను గాంథి మహాత్ముడే ఉండొచ్చు .. స్వాతంత్రం తెచ్చాడని అతనికి ప్రతి ఏడు హారతులు పడుతూ ఉండొచ్చు .. కానీ నిఖార్సయిన విప్లవ కారుడిగా భగత్ సింగ్ పేరు ఎప్పటికి నిలిచి ఉంటుంది . 


తెలుగు నాట జార్జి రెడ్డి పేరు అలాగే గుర్తు చేసుకుంటాము 


వాళ్ళే మొత్తంగా సమాజం లో మార్పులకు కారకులు అని కాదు కానీ వాళ్ళు మన హృదయాల్లో ప్రతీకలుగా మిగిలిపోయారు . 

.. 

ఈ భూగోళం  మీద ఒక చెమట చుక్క .. ఒక నెత్తు టి బిందువు లాంటి మనం పుట్టిన ఊర్లు ఉంటాయి . ఆ ఊరు పేరు నిలబెట్టే మనుషులు ఉంటారు .. 

సింగరేణి బొగ్గు గని ప్రాంతమైన మందమర్రిలో మునీర్ అనే వ్యక్తి ఒక సమూహం .. ఒక ముఖ చిత్రం .. ఇంగ్లీష్ లో చెప్పుకోవాలంటే .. పోస్టర్ బాయ్ .. 

మా తరానికి 1980 దశకం లో .. ఆ పేరు ఒక్కటే చాలు .. 

 శోధన

నీ వల్లే సుసంపన్నమయ్యా

బహుశా నీ వల్లే... 

సమృద్దమయ్యా.. 


ఆ నీవెవ్వరో కనిపెట్టే ప్రయత్నమే

ఒక జీవితమై నలుదిక్కులా పరుచుకుంది 

ఒక వలపులా.. తియ్యని తలపు లా.

 ఏది నిట్టనిలువుగా చీలదు


ఏది నిట్ట నిలువుగా చీలదు

నువ్వో  వైపు.. 

నేనో వైపు .. 

నిరంతరం చలనంలో వుంటాం.. 

తిరిగి తిరిగి కలుస్తుంటాం.. 

సునామిలు చెలరేగినా  సముద్రము 

చీలిపోదు.. 

భూకంపాలు వచ్చినా భూగోళం

ముక్కలవదు

అవిశ్రాంత పోరాటం నిలబెట్టిన 

అపురూప జీవాలం... మనుషులం

మన ఐక్యత లో సమాజాలు నిలిచాయి 

నాగరికతలు రూపు దిద్దుకున్నాయి

ఘర్షణతో ముందుకే నడిచాయి 

అంతే  కాని. . 

మనిషెప్పడు  భయంతో చెదరిపోలేదు

స్వార్థ చింతన తో చీలిపోలేదు


7, నవంబర్ 2022, సోమవారం

 అభాగ్య జీవులు .. 

the wretched  of  the  earth . by frantz  fanon 


పాలక వర్గాన్ని ప్రాధమికంగా నిర్వచించేది ఫ్యాక్టరీలు ,ఎస్టేట్లు ,బ్యాంకు అకౌంట్స్ కాదు. పాలక జాతి అంటే మొట్ట మొదటిగా ,స్థానికుల కంటే భిన్నంగా ఉండే వేరే ప్రాంతం నుండి వచ్చిన బయటివాళ్ళు. ఇతరులు. 


వలస ప్రాంతాలలోని చర్చి తెల్లవాడి చర్చి . విదేశీయుల చర్చి . అక్కడి చర్చి పిలుపులు వలస ప్రజలని భగవంతుని మార్గానికి మల్లించేవి   కావు . తెల్లవాళ్ళ మార్గానికి ,యజమాని మార్గానికి ,ఆధిపత్యం చెలాయిన్చే వాళ్ళ మార్గానికి మల్లించేవి . 


మానికీయం తత్వం ... ఒక పురాతన ధార్మిక చింతన . సృష్టి లోని ప్రతీది పరస్పర విరుద్ధమైన రెండు శక్తులుగా విడిపోయి ఉంటుందని భావిస్తారు . మంచి -చేడు . తెలుపు- నలుపు . దేవుడు -దెయ్యం . ఒకటి ఉండి రెండోది లేకపోవడం అనేది ఉండదు ఇప్పుడు దీనిని డ్యూయలిజం లేదా ద్వైతం అంటున్నారు. 

వలస పాలకుడు రూపొందించిన ప్రపంచము లో వలస పాలితుడిని ఎప్పుడు నేరస్థుడిగానే పరిగణిస్తారు.  వలస పాలితుడు తన నేరాన్ని అంగీకరించడు. కానీ దాన్ని ఒక శాపం గా పరిగణిస్తాడు . 

ఏది ఆటంకంగా  ఉన్నదో అదే కొన్ని ఉద్వేగ పూరిత సమయాల్లో జరగవలిసిన కార్యాన్ని ఉధృతం  చేస్తుంది . 

మతం వల్ల  వలసపాలితుడు కూడా వలస పాలకుని ఉనికిని గమనించకుండా ఉండిపోతాడు . 

వలస ప్రపంచం లో ,వలస ప్రజల ఉద్వేగాలు ఎప్పుడు , పచ్చి పుండు సున్నానికి జంకినట్టు అతిసులభంగా గాయపడేలా ఉంటాయి 


వలస దేశాలలో కేవలం రైతాంగం మాత్రమే విప్లవాత్మకం గా ఉంటుందనేది చాలా స్పష్టం . వాళ్లకి పొందడానికె తప్ప పోగొట్టుకోవడానికి ఏమి లేదు . ఏ హక్కులు లేక దోపిడీకి గురవుతూ ,కడుపు మారుతున్న రైతు చాలా తొందరగానే హింస ద్వారానే ఫలితం ఉంటుందని గ్రహిస్తాడు . 

వలస దేశాల ఉన్నత వర్గం ,అంటే విముక్తి పొందిన బానిసలు ఒకసారి ఉద్యమ శీర్ష స్థానానికి వచ్చాక అనివార్యంగా బూటకపు ఉద్యమాలు నడుపుతారు 


వలస దేశపు వ్యక్తి భార్యకు దుస్తులు కొనే బదులు రేడియో కొనుక్కోవడం చూసి కొన్ని సార్లు కొందరు ఆశర్యపోతారు . కానీ అలా ఆశర్య పోనవసరం లేదు . వాళ్లొక ప్రళయాంతక వాతావరణం లో ఉన్నారు కాబట్టి అన్నీ అనుభవించాలని అనుకొంటారు . 


పని పరిస్థితులను చక్కదిద్దక పోతే సామ్రాజ్యవాద  శక్తులు జంతు స్థాయి కి కుదించిన ఈ ప్రపంచాన్ని మళ్ళి  మానవీకరణ చేయటం కష్టం . 

 

పేజీ నెంబర్ 99;

రాజకీయ చైతన్యం కలిగిన కార్మిక సంఘ్ నాయకుడంటే ,స్థానిక వివాదమే తనకు ,యాజమాన్యానికి మధ్య కీలకమైన ఘర్షణ కాదని గుర్తించగలిగిన వ్యక్తి .. 


పెట్టుబడి దారి దేశాలలో కార్మికులకు పోయేదేమీ లేదు . అన్నీ సాధించుకోవచ్చు .. వలస దేశాలలో మాత్రం కార్మిక వర్గం ప్రతిదానిని పోగొట్టుకోగలదు . 

పేజీ నెంబర్ 127;

కొన్ని రాయితీలు నిజానికి సంకెళ్లు అని తెలియచెప్పే చారిత్రిక సూత్రం గురుంచి ప్రజలు ,ప్రతి పొరాట  యోధుడు సచేతనంగా ఉండాలి . 

వలస ప్రజలు వలసాధికారుల నుంచి ఎక్కువలో ఎక్కువగా రాయితీలు అంగీకరించ వచ్చు  కానీ ,ఎప్పుడు రాజీకి మాత్రం అంగీకరించకూడదు .  

రైతాంగం విషయానికి వస్తే ,వాళ్ళు ఆచరణాత్మక అనుభవం ద్వారా తమ జ్ఞానాన్ని పెంపొందించుకొని ,ప్రజల పోరాటానికి నాయకత్వం వహించేందుకు సమర్ధులని నిరూపించుకుంటారు . 


పేజీ నెంబర్ 134;

తమకు ,దేశానికి ఎక్కువ లాభదాయకమైన ఫ్యాక్టరీస్ ను ఏర్పాటు చేయలేక ,ఈ పెట్టుబడిదారీవర్గం స్థానిక వృత్తులకు దేశభక్తి ముసుగు తొడుగుతుంది 

తన చారిత్రిక కర్తవ్యం ఒక మధ్యవర్తిగానే అని దేశీయ బూర్జువా వర్గం తెలుసుకుంటుంది . మనం గతం లోనే చూసినట్లు ,దాని పని దేశాన్ని మార్పు చేయటం కాదు నయావలస వాద ముసుగు వెనక తనను దాచిపెట్టుకోక తప్పని పరిస్థితి లో అది పెట్టుబడి దారి విధానానికి ఒక వాహక పట్టి (కన్వేయర్ బెల్ట్ ) గా మాత్రమే ఉపయోగ పడుతుంది . 

ఇప్పుడు మనం జాతీయవాదం నుండి ,జాతీయ ఉన్మాదానికి ,అంధ దేశ భక్తికి ,జాతి వివక్ష కి చేరుకున్నాం . 

పేజీ నెంబర్ 170 ;

యువత క్రీడా ప్రాంగణాలు వైపు కాక పొలాల వైపు ,పాఠశాలల వైపు చూడాలి . 

వృత్తి క్రీడాకారులను తయారు చేయడం పై కాక ఆటలు కూడా ఆడే చైతన్యమైన వ్యక్తులను తయారు చేయడం ముఖ్యం .. 

మన దేశం లో ఏమి జరుగుతుందో నని నిరంతరం అర్థం చేసుకోవడమే మన అతి పెద్ద కర్తవ్యం . 

రాజకీయ శిక్షణ అంటే మెదడుకు ద్వారాలు తెరవటం ,మెదడును జాగృతం చెయ్యడం ,దానిని ప్రపంచానికి పరిచయం చెయ్యడం .. సెజేయుర్ చెప్పినట్టు ;"మనుషుల అంతరాత్మలను కనుకొనటం .. 

ప్రజలను రాజకీయవంతం చేయటం అంటే దేశం మొత్తాన్ని పౌరులైన ప్రతి ఒక్కరికి చెందిన వాస్తవం గా మలచటమే .. దేశపు అనుభవాన్ని ప్రతి ఒక్కరి అనుభవంగా చేయటమే .. 

ఆలోచనా ప్రపంచం లో మనిషి .. ప్రపంచానికి మెదడు -సేకొటారి 

ఒక వంతెన కట్టడం లో కట్టేవారి చైతన్యం పెరగక పోతే అటువంటి వంతెన కట్టవద్దు . ప్రజలు నదిని ఈది దాటనివ్వండి లేదా పడవను ఉపయోగణించనివ్వండి . పెద్దపెద్ద యంత్రాలతో వంతెనను అక్కడ తెచ్చి పెట్టొద్దు వంతెన నిర్మాణం పౌరుల మెదడు లు ,కండరాలతో జరగాలి . 

పౌరుడు వంతెనను తప్పక తనదిగా చేసుకోవాలి అప్పుడే,అప్పుడు మాత్రమే ,అన్నిటిని సాధించగలం .. 

జాతీయవాదం ఒక రాజకీయ సిద్ధాంతమో ,ఒక కార్యక్రమమొ కాదు మనం మన దేశాన్ని నిజంగా తిరోగమనం ,నిష్క్రియా పరత్వాల నుండి లేదా కుప్పకూలిపోవడం నుండి కాపాడాలనుకుంటే వీలైనంత త్వరగా జాతీయ చైతన్యం నుండి సామాజిక రాజకీయ చైతన్యానికి  మరలాలి . 

పేజీ నెంబర్ .. 212; 

మానవాళి విముక్తి కోసం జరుగుతున్న నిజమైన పోరాటం పై ఈ రోజు సామ్రాజ్య వాదం యుద్ధం చేస్తోంది . అది అక్కడక్కడా వినాశనబీజాలు నాటుతుంది . వాటిని మన నేల నుండి ,మన మనుసుల నుండి నిర్దాక్షిణ్యంగా పీకి పారేయాలి . 

ప్రతి కూలమైన ,పాలించ వీలు కాని  .మౌలికంగా తిరగబడే "ప్రకృతి " వలస దేశాల్లోని అడవి ,దోమలు ,స్థానికులు ,రోగాలకు పర్యాయ పదమే . మచ్చిక కాని  ఈ ప్రకృతిని ఒక్క సారి నియంత్రణ లోకి తీసుకు రాగలిగితే  వలసవాదం విజయవంతం అయినట్టే ,, అడవుల గుండా రోడ్లు వేయటం ,మడ భూముల నుండి నీళ్లు తోడేయటం ,స్థానిక ప్రజల ఆర్ధిక ,రాజకీయ అస్థిత్వాన్ని గుర్తించ నిరాకరించటం - ఇవన్నీ ఒకటే . 


#############












 మందమర్రి - కళ్యాణిఖని 

ఒక ఊరు రెండు పేర్లు 


పారిశ్రామిక ప్రాంతాలలో ,అభివృద్ధి ప్రాజెక్టులలో ఊర్లు ,ప్రజలు విస్థాపితులు కావటం మామూలే .. 


 నన్ను వెంటాడిన హీరో .. మునీర్ 


ఒక మిత్రుడి నాన్న గారి జీవితకథ పుస్తకం పూర్తయ్యేసరికి నాలో నన్ను చూసుకొనే నా ఊరు మందమర్రి,నేను ఎరిగిన మనిషి మునీర్ గురుంచి కూడా రాయగలననే నమ్మకం కుదురుకుంది . అప్పుడే మనుసులో బుక్ పేరు కూడా పెట్టేసు కున్నాను . ఆ తర్వాత అతడికి ఆ విషయం కూడా చెప్పేసేనను దాచుకునే ఓపిక లేక .. అతను నవ్వేసి ఊరుకున్నాడు . 

"మనదమర్రి ముఖ చిత్రం -మునీర్ "పుస్తకం పేరు . మిత్రుడు రామ్మూర్తి ఎప్పటిలాగే ముందు పడ్డాడు . అది ఒక ముందడుగు . అంతకు ముందు చాలా వెనకడుగులు పడ్డాయి . అందుకే దీన్ని ప్రస్తావించడం .. 

ఇక మునీర్ విషయం లోకి వద్దాం . 

ఇంతకీ నువ్వెవరి వయ్య ఇంత లావు మాట్లాడుతున్నావు ?

నా పేరు వెంకట్రావు . మా నాన్న పేరు సాహెబ్ .. మాది మందమర్రే . నేను ఇక్కడే చదువు కున్నాను. ప్రస్తుతం ఉద్యోగం హైదరాబాద్ లోనే . ఇక మిగిలిన విషయాలు మాటల మధ్యలో చెప్పుకొందాము . 

మునీర్ .. నన్నెప్పుడు అబ్బురపరుస్తూనే ఉండే వాడు . నేను అతన్ని ప్రైమరీ స్కూల్(కార్మెల్ స్కూల్) నుంచి ఎరుగుదును . నేను అతనికి తెలియదు . నాకు మూడు ఏండ్లు సీనియర్ . మునీర్ తమ్ముడు మొయినుద్దీన్ నా క్లాస్ మెట్ . 

మందమర్రి కాలరీస్ ప్రాంతం లో అప్పటికి రెండే పెద్ద స్కూల్స్ . ఒకటి జిల్లా పరిషత్ హై స్కూల్ .. దీన్నీ ఒర్రెగడ్డ బడి అనేవారు . ఒర్రె అంటే చిన్న కాలువ .. దాన్ని దాటి వెళ్ళాలి బడికి . వర్షాకాలం వరదొస్తే బడికి సెలవే . 

ఊరిచివర దొరగారి  శ్రీకృష్ణ టాకీస్ .. 

ఇంకోటి .. కార్మెల్ స్కూల్ .. క్రిస్టియన్ మిషనరీస్ వాళ్ళది . కేరళ సిస్టర్స్ (Nuns ),లోకల్ టీచర్స్ కలిసి చదువు చెప్పేవారు . 7 వ తరగతి వరకే ఉండేది . 

సింగరేణి కంపెనీ వారిస్థలంలోనే ఉండేది ఈ స్కూల్ . వెనకే అరకి లో మీటర్ దూరంలో బొగ్గుగని ఉండేది . కల్యాణి ఖని 5 అని పిలిచేవారు .,బొగ్గురవాణాకి రైల్వే లైన్ కూడా ఉండేది . బొగ్గు కుప్పలా మధ్య ఈ స్కూల్ ఉండేది . స్కూల్ ముందు బొగ్గు లారీలు వెళ్లేందుకు తారు రోడ్డు ఉండేది 

మునీర్ ఏడవ  తరగతి లో ఉన్నప్పుడే అనుకుంట .. స్కూల్ ముందు ఉండే  ఆ తార్రో డ్డు మీద ఎవరితోనో గొడవ పడ్డాడు . కంపాస్ బాక్స్ లో ఉండే స్టీల్ డివైడర్ తో పొడుచుకున్నారు . అది నాకు మునీర్ తొలి జ్యాపకం . 

మనిషి బలిష్టంగా ఉండేవాడు .. మరీ అంత పొడుగు గాక పోయినా పొట్టి కూడా కాదు . ఆ గొడవల్లో రక్తాలు కారాయి .. కల బడ్డారు. గాయపడ్డారు . అలా గొడవల ద్వారా గుర్తుండిపోయిన మనిషి జీవితమంతా ఆయన మీద దాడులు , ఆయనకి దగ్గరగా తెలిసిన కార్మికనాయకుల హత్యలు ,చివరకు ఆయనే మందమర్రి భూస్వామి హత్యా కేసు లో ఇరుక్కొని జైలు జీవితం .. ఇలా ఒక ఆంగ్రీ హీరో సినిమా కథ లాంటి మలుపులు .. 

ఇంత జరిగాక ఎవరైనా సరే శేష జీవితం ప్రశాంతంగా గడిపేస్తారని అనుకుంటుంటారు .కానీ అలా ఏమి జరగక పోగా కంపెనీలో తన ఉద్యోగం చేసుకుంటూనే ,జర్నలిస్ట్ గా కొనసాగాడు .. ఆ తర్వాత తెలాంగాణ ఉదయమం లోను పెద్ద పాత్రే నిర్వహించాడు . 

తనను తాను ఎప్పుడు ఎదిగించుకుంటూ , సమకాలీన విషయాల పట్ల క్కూడా తెలివిడిగా ఉంటూ జీవితం లో విజయవంతంగా ముందుకు దూసుకెళ్లే మునీర్ మన తరానికి, ముందుతరాలకు కూడా   ఒక రోల్ మోడల్ అనడానికి ఎలాంటి సందేహం అవసరం లేదు..