27, సెప్టెంబర్ 2021, సోమవారం

 అపవిత్ర  ఆపద్ధర్మమ్


రిపబ్లిక్ అఫ్ హిందుత్వ .. ఇంగ్లీష్ పుస్తకమే ..రచయిత బద్రి నారాయణ . పెంగ్విన్ ప్రచురణ . ప్రధమ ముద్రణ 2021 . 

మొత్తంగా బీజేపీ ని ఇప్పుడు నడిపిస్తున్న RSS  గురుంచి లోతైన అవగాహన  కల్పించే  రచన ఇది 

అయితే రచయిత ముగింపులో ఒక చివరిమాట రాశాడు . అది కరోనా సమయంలో లొక్డౌన్ వల్ల వలస కార్మికులు గురుంచి . కంపెనీలు మూసివేయటం వల్ల కాలినడకన వేల కిలోమీటర్ల దూరాన్ని కూడా లెక్కచేయకుండా పుట్టిన గడ్డకు చేరుకోవాలనే ఎన్నో విషాద యాత్రలు జరిగాయి 

అప్పటివరకు వెర్రితలలు వేసిన హిందుత్వం మౌన ముద్రలోకి జారిపోయింది . సర్వ సత్తాక రాజ్యం చేతులు ఎత్తివేసింది . 

కష్టజీవులు అందరూ  ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని దిక్కులేని చావుకి బలి కాకుండా తమ కుటుంబ సభ్యుల మధ్య కు చేరుకోవాలని విశ్వప్రయత్నమే చేశారు . 

మరి భారతదేశ సమాజానికి వెన్నెముక లాంటి కులం .. బ్రతికి బట్ట కట్టడమే ప్రధాన మైన కరోనా కాలంలో ఎలాంటి పాత్ర నిర్వహించింది -అనే విషయం పై రచయిత కొంత పరిశోధన చేసాడు . 

కులమతాలకు అతీతంగా ప్రజలు మానవత్వానికి పెద్ద పీట  వెయ్యడం గురుంచి మనం అందరం మీడియాలో చూసాం . 

కానీ కులం అంత ఈజీ గా రూపు మాసిపోయే వ్యవహారం కాదని మనకందరికీ తెలిసిన వ్యవహారమే కదా !

ఆపద్ధర్మమ్ గా వచ్చే మార్పులు మామూలు పరిస్థితులు నెలకొన్నాక కొనసాగవు .  

దాని గురుంచి ఉపనిషత్ ల్లోంచి ఒక కథ ని పట్టుకొస్తాడు రచయిత . 

 ఛాందోగ్య ఉపనిషత్తు లో చక్రాయన ఉసష్టి అనే వ్యక్తి .. ఈయన ఉండే ఊరిలో కరువు విలయ తాండవం చేస్తుంటుంది . వరుసగా రెండురోజులు అతడు ఆకలితో అలమటిస్తూ  ఉంటాడు  . దాంతో ఇంకో  ఊరికి వెళదామని నిర్ణయిచుకుంటాడు . అయితే ఆ ఊరిలో కూడా అదే పరిస్థితి  ఉంటుంది . అక్కడి నుండి ముందుకు సాగిపోతాడు . దారిలో ఒక చెట్టు కింద ఒక మనిషిని చూస్తాడు . ఆ మనిషి  దేన్నో నాకుతూ తింటూ ఉంటాడు . 

ఉసష్టి అతని దగ్గరికి వెళ్లి ఏమి తింటున్నావని అడుగుతాడు . 

నేను పప్పు తింటున్నాను --అని   సమాధానం చెబుతాడు 

గత రెండు రోజులుగా ఆకలి తో అల్లాడిపోతున్న ఉసష్టి  తనకు కొంచెం పెట్టమని అడుగుతాడు . 

అయ్యో !నీకు తప్పక ఇచ్చే వాడినే  . కాని ఇప్పుడు అది అపవిత్రం అయిపోయింది . 

అపవిత్రం అయితే అయ్యిందిలే .. నాక్కొంచెం ఇమ్మని  పాపం ఉసష్టి  ప్రాధేయ పడతాడు . 

అతడు  ఉసష్టి కి తను తింటున్న పప్పులోంచి కొంచెం తీసి పెడతాడు.   

అతడి దగ్గర మట్టి కుండ నిండా మంచినీళ్లు కూడా ఉంటాయి . 

అతడు కుండకి మూతి పెట్టి కొన్ని నీళ్లు తాగి ,ఉసష్టి  కోసం కొన్ని మిగుల్చుతాడు . 

పప్పు తినేసి ఉసష్టి వెళ్లి పోవటానికి  సిద్దమవుతాడు . 

కొన్ని నీళ్లు తాగి వెళ్ళు  ! అంటాడు అతను .

దానికి సమాధానంగా -

నేను అపవిత్రమైన నీళ్లు తాగను -  అంటాడు  ఉసష్టి . 

నువ్వు  అపవిత్రమైన పప్పు తినగలిగావు .  అపవిత్రమైన నీళ్లు ఎందుకు తాగలేవు ? అని అడుగుతాడు  అతను . 

ఉసష్టి భలే సమాధానం ఇస్తాడు 

నేను  ఆ అపవిత్రమైన పప్పు తిని ఉండక పోతే  ఈ  పాటికి చచ్చి ఉండేవాడిని. 

ఇప్పుడు నాకు కొంచెం శక్తి వచ్చింది . నడవగలుగుతాను . దగ్గర్లోని ఏదైనా జలపాతం వద్ద నీళ్లు తాగుతాను  *


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి