9, ఏప్రిల్ 2021, శుక్రవారం

కనక రాజు .. 
చర్చ్ చుట్టూ అల్లుకున్న జీవితాల్లో  అదే పేరు .. 
జనం లోకి వచ్చి జనార్దన్ అయ్యాడు .. 
సాహిత్యం లోకి వచ్చి సముద్రుడు అయ్యాడు . 

నువ్వు ఆడమనిషివి అయితే నిన్నే పెండ్లి చేసుకునేవాడిని .. అన్నాడు సాహిత్యం మీద పిచ్చితో ..  ఒకసారి నగరం లోని ఒక కేఫ్ లో కూర్చున్నప్పుడు .. ఇక అది  విడిపోయేవేళ ..
నన్ను చూసి కవి కావాలని ప్రయత్నించానని అనేవాడు .
 ఆ పట్టుదల అతన్ని అడవిగా నిలిపింది ..
సముద్రానికి  కవిత్వాన్ని  వినిపించటం అతనికే సాధ్యమైంది. 
కవితా చరణాలను గుండె మీది జేబులో పెట్టుకొని తిరిగేవాడు 
చాయ్ తాగుతూనే దానికి నడక నేర్పేవాడు 
అయినా  ఆ కవిత ని ఒక కలల  సిలువగా మోసుకుని తిరిగేవాడు 
ఒక సారి ఎంత ప్రేమగా అడిగాడో .. నేను చనిపోయిన తర్వాత నా మీద ఒక కవిత రాస్తావా అని..
అతని మరణ వార్త తెలిసి ఎడారుల నుంచి దుః ఖ మై వచ్చాను . 
వాడు నాలో సముద్రమై నిండిపోయాడు 

వాడి కవితా  పాదాలతో నడుస్తున్నాను 

వాడు రాసిన కవితగానే మిగిలిపోతాను 
  

వాడు అమరుడు .. నాలో  అజరామరుడు . 

 
                                                
 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి