14, మార్చి 2013, గురువారం

ఓ ఫైవ్ వుంటే ఇవ్వు గురూ..

కథ 


   ఒక అవసరం వుంటుంది . మొహమాటము అడ్డొస్తుంది .ఎదుటి వ్యక్తి మనల్ని చిన్నచూపు చూస్తాడేమో ననే భయం కూడా పట్టి పీడిస్తుంది . డబ్బులు ఉన్నప్పుడు ఎంత దర్జాగా బ్రతికేస్తామో ,జేబులో చిల్లిగవ్వ లేనప్పుడు అంతగా అల్లల్లాడి పోతాము . కాని మొహం మీద దాన్ని కప్పిపెట్ట డానికి శతవిధాలా ప్రయత్నిస్తాం . ఏదో పర్స్  మరిచిపోయి నట్టు ,రావలసిన డబ్బులు రాలేదనో చెప్పి ,పక్కవాడిని 'ఓ ఫైవ్ వుందా గురూ ? అని చాలా స్ట యులు గా అడుగుతాం . పాతవాల్లయ తే  మనలను కనిపెట్టి తప్పుకు పోతారు . కొత్త వాల్లయ తే  బుట్టలో పడతారు .
అవసరాలు తీరేందుకు మనిషి పడే తాపత్రయాలు ఎన్నోకదా  !
పాపం !పీత కష్టాలు పీతవి లాగా మనిషి కష్టాలు మనిషివి మరి  !

   నా పరిచయం కూడా మీకు అవసరమే . ఎందుకంటే ఇదంతా నా కళ్ళు చూసి ,నా బుర్ర అర్థం చేసుకొన్నవిషయాలే . నాపేరు ఓ సుబ్బారావు లాగ వెంకట్రావు . వయసు యా బై  ముంచుకు వస్తున్నాయి .ఊరు హైదరాబాద్ .  ప్రస్తుతం నిరుద్యోగినే . దిగులు మామూలే . మరీ ,ఓ ఫైవ్ కోసం ఏమీ ఎదురు చూట్టం లేదు కాని జీవితం సాదా సీదాగా గడిచి పోతుంది .
మొన్నొక సాయంకాలం అలసిపోయు కొంత ,అలవాటుగా కొంత మార్కెట్ వేపు వెళ్లాను , టీ కోసమే .

టీ కొట్టు గురుంచి చెప్పాలంటే ,రావిశాస్త్రి గారి రత్తాలు ,రాంబాబు నవలలోని కిల్లి కొట్టు వర్ణనలు  గుర్తుకొస్తున్నై . కోస్తా ఆంధ్రలో వుండే కిల్లి కొట్టు అంత ఇదిగా లేకున్నా తెలంగాణ లో టీ కొట్టు కూడా అదే ఇది లో వుంటుంది . ప్రజలు తమను వ్యక్త పరుచుకునేది ఇక్కడే . ఈ లోకం తీరు గురుంచి ఒక అంచనా కి వచ్చేది కూడా ఇక్కడే . 

హైదరాబాద్ లో ప్రతి గల్లి చివరన ఒక ఇరాని టీ హోటల్ వుంటుంది . ఆ టీ  రుచే వేరు . అయితే నగరం ఆ ప్రాభవాన్ని కోల్పోతుంది . ఇప్పుడు హైదరాబాద్ చుట్టుతా రకరకాల వలసవాదుల ప్రభావాలు .  అవి  టీ దుకాణాల్లోకి కూడా చొచ్చుకు వచ్చాయు .

ఈ టీ షాప్ చాల షోగ్గా వుంటుంది . టీ చేసే అతను మాట కారి. గురజాడ అప్పారావు గారి నాటకం 'కన్యాశుల్కం 'లో గిరీశమే గుర్తుకు వస్తాడు . గిరీశం చాల పెద్దమనిషి . మాటలతో కోట లు కట్టించి ,లౌక్యం తో (ఆ నాటకంలోనే మధురవాణి అన్నట్లు లౌక్యం అంటే మోసమే )బ్రతికేయగల గొప్ప జీవి .

ఇవ్వాళా చాల గొప్పగా చెప్పబడుతున్న సేవారంగం ,వ్యాపారరంగంలో అందరికి గిరీశ మే ఆదర్శం . ఆదర్శాలని సైతం ఎలా తమకనుకూలంగా ,వ్యాపారంగా మార్చుకోవచ్చో గిరీశం ఆనాడే చాల అలవోకగా చెప్పేశాడు .

సేవారంగంలో ఉండే గొప్ప మనుషులకి (వాళ్ళని కార్మికవర్గం అందామా అంటే భయమేస్తోంది ),ఉత్పత్తి రంగంలో  వుండే కార్మికులకి మధ్య కొట్టొచ్చినట్టు కనిపించే తేడా ఏంటో తెలుసా ?
లౌక్యమే !ఈ సత్యం నాకు ఈ రోజే బోధ పడింది . ఈ జ్ఞానాన్ని మీకు పంచటానికి కూడా విచిత్రంగా గిరీశ మే ఆదర్శం  . మరి ,అలాంటిది గిరీశం ప్రభావం . గిరీశానికి తెలియని విషయాలు వుండవు . తెలియని విషయాన్ని  కూడా తెలిసినట్టు చెప్పగలగడమే గిరీశం ప్రత్యేకత . జీవితసత్యాలు అతనికి అర్థమయినంత ఈజీగా మనకెవ్వరికీ అంతు చిక్కవు .

మనం ఇప్పుడే అసలు కథ లోకి ప్రవేశo చేస్తున్నాం .

నేను ఒక టీ కి ఆర్డర్ ఇచ్చాను . టీ కలిపే పనిలో ఉన్నాడు మన గిరీశం . ఇంతలో అక్కడికి ఒక ముసలతను వచ్చాడు . నవ్వు మొఖం తోనే కొంచెం దీనంగా ఓ ఐదు రూపాలు ఇయ్యవానె  అని గిరీశాన్నే అడుగుతాడు . టీ కలుపుతూనే ,మా అందరి వేపు చూస్తూ గిరీశం స్పందిస్తాడు .

"పైసలడ గొద్దు  నన్ను"

నీకు నాగుండె కావాలా ? కోసి ఇచ్చేస్తాను ,అంటూ అభినయం తో చెప్పాడు . తన అభినయం తనకే నచ్చినట్టుగా ఉంది . మరో రెండు సార్లు రిపీట్ చేసి అదే విషయాన్నీ మళ్ళీ   వివరించాడు .
పాపం !ముసలతను బిక్కచచ్చి పోయాడు .
గిరీశంకి మాంచి వినోదం లాగుంది .అతను మళ్లీ  విజ్రుభించాడు .

"నా జీవితంలో నాకు నచ్చని ఒకే ఒక విషయం , అప్పు ఇవ్వడం " అని పైపైకి నవ్వేశాడు .
ఆ ముసలతని ఐయుదు రూపాయల అవసరం గిరీశానికి తన పునాది నే కదిలిస్తున్నట్లు అలా  మాట్లాడుతూ నే వున్నాడు .నిజo గా అయుదు రూపాయల అప్పు వల్ల అంత ఇబ్బంది వుందా అని గిరీశాన్ని అమాయకంగా అడిగాను నేను .
 గిరీశం మరింత ఉత్సాహంగా చెప్పుకొచ్చాడు ..
"ఈ రోజు ఐదు ఇస్తే రేపు పది రూపాయలు అడుగుతారు . పది ఇస్తే ఇరవై రూపాయలు అడుగుతారు "అంటూ అడుక్కోవడం గురుంచి ఎయిడ్స్ వ్యాది గురుంచి చెప్పినట్టు చెప్పాడు .

నేనింకా అమాయకంగా అడిగాను గిరీశాన్ని ;అయుదు రూపాయలు ఇవ్వడం కంటే గుండె కోసి ఇవ్వడమే ఈజీ అంటావా ?
అయితే అతను అద్బుతమైన సమాధానం ఇచ్చాడు .

"అయుదు రూపాయలు అవసరం ఉన్నోడు మన గుండే నేమి చేసుకుంటాడు సార్ ?
ఐనా మనం ఏదీ ఇవ్వం ,తీసుకోవడం తప్ప . ఇచ్చేస్తూ పోతే చివరికి మనమూ అడుక్కోవలసి వస్తుంది .

నిజంగా నా గుండెనే ఎవరో కోసేస్తున్నట్లు ఫీల్ అయ్యాను . అప్పటికే ముసలతను గిరీశం బాధ చూడలేక ఎటో వెళ్ళిపోయాడు .

కాని నా మనస్సు ఆలోచనలో పడింది . ఎంత వేదాంతం చెప్పాడు టీ కొట్టు గిరీశం !అయుదు రూపాయల కోసం గుండె కోసేసుకుంటా ననే అబద్దం ఆడగల 'లౌక్యాన్ని'ఎలా దిగామింగుకోవాలో అర్థం కాలేదు నాకు .
 మమత కోసం ,మంచి కోసం ,మనిషి కోసం ,మొత్తంగా ఒక మంచి సమాజం కోసం ప్రాణాలు సైతం అర్పిస్తున్న వారిని మనమెరుగుదుo . కాని గిరీశం వాటిని పట్టించుకోడు .పైగా తనే ,తన స్వార్థం కోసం ,లౌక్యంగా "ఓ ఫైవ్ వుంటే ఇవ్వు గురూ " అంటూ లోకం మీద పడతాడు .      *

2 కామెంట్‌లు: